భద్రాద్రి రామయ్య ను దర్శించుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శుక్రవారం భద్రాద్రి రామయ్య ను దర్శించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు..ఈరోజు ఉదయం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో స్వామివారి మూలవిరాట్ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు.

ఈ సందర్భాంగా చంద్రబాబుకు స్వామివారి ప్రసాదాలతో పాటు వేదాశీర్వచనం అందించారు ఆలయ అర్చకులు,వేదపండితులు. చంద్రబాబుతో పాటు స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమ మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. దర్శనం అనంతరం చంద్రబాబు భద్రాచలం కరకట్టను పరిశీలించారు. 2002లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కరకట్ట నిర్మాణం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన కరకట్ట భద్రాద్రి వాసుల పాలిట శ్రీరామరక్షగా నిలిచిందని ఈ సందర్భంగా చంద్రబాబుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్టీఆర్ హయాంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ సమస్యను స్వయంగా పరిశీలించానని చెప్పుకొచ్చారు. చేసిన అభివృద్ధి సామాజిక సేవా శాశ్వతంగా ఉండటం ఎంతో తృప్తి నిస్తోందని తెలిపారు. 20 ఏళ్ల క్రితం కట్టిన కరకట్టను ప్రజలు ఈనాటికీ గుర్తుపెట్టుకోవటం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్న చిన్నపాటి లోటుపాట్లను ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. విలీన గ్రామాల్లో కరకట్టల నిర్మాణం చేపట్టి బాధిత ప్రజలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని చంద్రబాబు సూచించారు. ఇక చంద్రబాబు ను భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదేం వీరయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఐదు విలీన గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిపేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా చంద్రబాబును కోరారు.