ఉమా మహేశ్వరి మరణంపై చంద్రబాబు భావోద్వేగ ట్వీట్..
దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మరణం ఫై చంద్రబాబు భావోద్వేగ ట్వీట్ చేసారు.
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సదరు ట్వీట్లో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మధ్యనే కుటుంబ సభ్యులందరం కలుసుకుని ఆనందంగా గడిపామని గుర్తు చేసుకున్న చంద్రబాబు… ఇంతలోనే ఇంతటి విషాద వార్త వినాల్సి రావడం దురదృష్టకరమని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ క్రమశిక్షణను పుణికిపుచ్చుకున్న ఉమామహేశ్వరి ఎంతో హుందాగా, శాంతంగా ఉండేవారని చంద్రబాబు తెలిపారు. ఉమా మహేశ్వరి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆయన సంతాపం తెలిపారు.
ఉమామహేశ్వరి గారు ఇక లేరన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని నారా లోకేష్ ట్వీట్ చేసారు. కుటుంబంలో ఏ శుభకార్యమైనా చిన్నమ్మ ఎంతో పెద్దమనసుతో దగ్గరుండి జరిపించేవారని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. మార్గదర్శిగా నిలిచిన చిన్నమ్మ మృతి తమ కుటుంబానికి కోలుకోలేని విషాదం అని పేర్కొన్నారు. చిన్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
మానసిక సమస్యలు, ఒత్తిడి కారణంగా ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మధ్యాహ్నం ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె పోస్టుమార్టం పూర్తి అయ్యింది. ఎల్లుండి ఆమె అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.