స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ లేదు..చంద్రబాబు

విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా శ్రీనివాస్ ఊపిరి పోశారు

విశాఖ: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీరణను వ్యతిరేకిస్తూ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాస్‌ను టిడిపి అధినేత చంద్రబాబు పరామర్శించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ నగరం లేదని, ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమానికి పల్లా శ్రీనివాసరావు తన దీక్షతో ఊపిరి పోశారని పేర్కొన్నారు.

ఆనాడు ఉక్కు ఉద్యమంలో ఎవరూ తుపాకులకు భయపడలేదని, 32 మంది ప్రాణత్యాగాలు చేశారని చంద్రబాబు అన్నారు. ఇందిరాగాంధీ అంతటివారు సైతం దిగొచ్చారని తెలిపారు. ఉక్కు సంకల్పంతో ముందుకెళ్లి ఉక్కు కర్మాగారాన్ని సాధించారని గుర్తుచేశారు. నాడు అంతమంది ప్రాణత్యాగం చేస్తే, వారి ప్రాణత్యాగాల విలువ తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఓట్లు వేశాక జగన్ రెడ్డికి ప్రజలతో అవసరం తీరిపోయిందని, అందుకే హోదా గురించి మాట్లాడడంలేదని అన్నారు. ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో విధ్వంస పాలన షురూ చేశారని మండిపడ్డారు.

ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ అని, దీని ద్వారా రూ.33 వేల కోట్ల పన్నులు చెల్లించారని వివరించారు. ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు కూడా పన్నులు కట్టారని తెలిపారు. తాను మెచ్చే నగరం ఎప్పటికీ విశాఖపట్నమేనని ఉద్ఘాటించారు. విశాఖ మంచివాళ్లు ఉండే నగరం అని చంద్రబాబు అభివర్ణించారు. ఇక్కడి ప్రజలు ఎంతో నీతి నిజాయతీపరులని, అందుకే ఈ నగరాన్ని తాను అమితంగా ఇష్టపడతానని వివరించారు. ఒకప్పుడు చిన్నగ్రామంగా ఉన్న విశాఖ నేడు ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉందని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/