మానవాళి చరిత్రలో ఒక సమున్నత శిఖరం గాంధీ

గాంధీ మహాత్ముని దివ్య చరిత్రను స్మరించుకుందాం..చంద్రబాబు

Chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ట్వీట్లు చేస్తూ..ఏపిలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘మానవాళి చరిత్రలో ఒక సమున్నత శిఖరం గాంధీ మహాత్ముడు. ఆయన నమ్మి ఆచరించి చూపిన సిద్ధాంతాలు కాలానికి అతీతమైనవి. సమ సమాజం గురించి తపించారు గాంధీజీ. కానీ, ఈ రోజు దళితులపై జరుగుతున్న దాడుల్లో దేశంలోనే ఏపీ ముందుండటం దురదృష్టకరం’ అని చంద్రబాబు అన్నారు.

‘కుల రాజకీయాలను, దళితుల అణచివేతను గాంధీ చూపిన అహింసాయుత మార్గంలోనే ఎదిరిద్దాం. సమాజంలో సమానత్వాన్ని సాధించి చూపడమే గాంధీజీకి మనం అందించగలిగే అసలైన నివాళి. గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని దివ్య చరిత్రను స్మరించుకుందాం’ అని చంద్రబాబు ట్వీట్లు చేశారు.

‘రాజకీయాలంటే స్వార్థమెరుగకుండా ప్రజాసేవలో తరించడమని… నైతిక విలువలతో కూడిన రాజకీయాలే ప్రజల భవిష్యత్తును వెలుగుమయం చేయగలవని నమ్మిన మహాశయుడు లాల్ బహదూర్ శాస్త్రి. ఆ మహనీయుని జయంతి సందర్భంగా జై కిసాన్ అన్న ఆ దేశభక్తుని స్ఫూర్తితో రైతు హక్కులను కాపాడేందుకు నడుంకడదాం’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/