విద్యుత్‌ బిల్లులను చూసి ప్రజలు షాక్ అవుతున్నారు

విద్యుత్ ఛార్జీలు పెంచి కరెంటే వాడుకోకుండా చేస్తున్నారు

Chandrababu Naidu
Chandrababu Naidu

హైదరాబాద్‌: టిడిపి అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. తమను ప్రశ్నించిన వారందరినీ ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. పీపీఈ కిట్లు ఇవ్వాలని అడిగితే డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్ చేశారని చంద్రబాబు అన్నారు. సుధాకర్‌ను తాగుబోతు అని అన్నారని, మానసిక పరిస్థితి బాగోలేదని ప్రచారం చేశారని చెప్పారు. సుధాకర్ విషయంలో తమపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రంగనాయకమ్మ అనే వృద్ధురాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నోటీసులు పంపారని గుర్తు చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కాగా ‘గుంటూరు సంపత్‌ నగర్‌ గుడిసెలో ఉండే ఓ వ్యక్తికి రెండు నెలల్లో రూ.3000 బిల్లు వచ్చింది. పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచి కరెంటే వాడుకోకుండా చేస్తున్నారు’ అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

‘విద్యుత్ ఛార్జీలు పెంచలేదని బుకాయిస్తూ శ్లాబ్‌లు మార్చి భారం మోపడం పెద్ద మోసం. మోసం చేసినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ప్రజలను మభ్యపెట్టేలా సీఎం జగన్‌ పలు ప్రకటనలు చేస్తున్నారు. అసత్యాలు చెప్పడంలో సీఎం జనగ్ సిద్ధహస్తులు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘అధికారంలోకి వస్తూనే పీపీఏలపై పడ్డారు. విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయడం వల్ల పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ రాకుండా చేశారు. విద్యుత్‌ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చాం. వేలల్లో వస్తోన్న విద్యుత్‌ బిల్లులను చూసి ప్రజలు షాక్ అవుతున్నారు’ అని చంద్రబాబు అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/