మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకా మేలు చేస్తా: చంద్రబాబు హామీ

పొన్నూరులో ముస్లిం మైనారిటీలతో సమావేశం

Chandrababu meeting with Muslim minorities in Ponnur

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా పొన్నూరులో ముస్లిం మైనారిటీ సోదరులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు మైనారిటీలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.

తన కుమారుడికి విదేశీ విద్య పథకం కింద నాటి టిడిపి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన సలాం అనే వ్యక్తి… ఇప్పుడు ఆ పథకాన్ని నిలిపివేశారని వాపోయారు. వడ్లమూడికి చెందిన పర్వీన్ అనే మహిళ తన రేషన్ కార్డు తీసేశారని రోదిస్తూ చెప్పారు. పలువురు ముస్లిం సోదరులు ఉచిత ఇసుక విధానం తీసేయ్యడం వల్ల తాము ఎలా నష్టపోయిందీ చంద్రబాబుకు వివరించారు. అంతేకాదు, ట్యాక్సులతో ఆటోమొబైల్ రంగాన్ని జగన్ సర్కారు సర్వనాశనం చేసిందని కొందరు ముస్లిం మైనారిటీలు ఆవేదన వ్యక్తం చేశారు.

వారి సమస్యలను ఓపిగ్గా విన్న చంద్రబాబు… టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశలో ఆయన ప్రసంగిస్తూ… 1983లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే… 1985లోనే ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఉర్దూను రెండో అధికార భాషగా చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఉద్ఘాటించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లడం కోసం… హైదరాబాద్ లోనే హజ్ హౌస్ కట్టానని వెల్లడించారు. నేరుగా హైదరాబాద్ నుంచే హజ్ యాత్రకు వెళ్లే అవకాశం కల్పించామని, హజ్ యాత్రకు ఆర్థిక సాయం కూడా చేశామని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ స్థాపించామని, విభజన తరువాత కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ నిర్మించామని వివరించారు. 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు.

“సంక్రాంతి సమయంలో సంక్రాంతి కానుక కూడా ముస్లింలకు వర్తింపజేశాం. 2014 తరువాత దుకాన్ మకాన్, దుల్హన్ పథకం తీసుకువచ్చాం. వాటన్నింటిని ఈ సీఎం వచ్చిన తరువాత రద్దు చేశాడు. పెళ్లి కానుక కింద లక్ష ఇస్తాను అని చెప్పి… నిలిపివేశాడు. మంత్రి పదవులకు 10వ తరగతి చదువు అర్హత అవసరం లేదు… సలహాదారులకు 10వ తరగతి అర్హత అవసరం లేదు… దుల్హన్ పథకానికి మాత్రం 10వ తరగతి చదువుకుని ఉండాలంట. టీడీపీ వచ్చిన తరువాత మళ్లీ దుల్హన్ పథకం తీసుకువస్తా. జగన్ రెడ్డిలా మోసం చెయ్యను… దుల్హన్ పథకం కింద లక్ష చెల్లిస్తా.

రంజాన్ తోఫాకు డబ్బులు లేవు… దుకాన్ మకాన్ కు డబ్బులు లేవు… విదేశీ విద్యకు డబ్బులు లేవు… కానీ సాక్షికి మాత్రం ప్రకటనలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. మైనారిటీ పిల్లల్లో ఉన్నత చదువులు అవసరం అని విదేశీ విద్య పథకం పెట్టాను. ముస్లింలకు విదేశీ విద్యతో మంచి అవకాశాలు సృష్టించే ప్రయత్నం చేశాను. రూ.3 లక్షల ఆర్థిక సాయం ఇచ్చి అందులో లక్ష సబ్సిడీ ఇచ్చి ముస్లిం వ్యాపారులకు అండగా నిలిచాం. ఇప్పుడు అన్నీ ఆపేశారు… అడిగితే కేసులు పెడతున్నారు.

నంద్యాలలో అబ్దుల్ సలాంపై తప్పుడు కేసులు పెడితే భయపడి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. అధికార పార్టీ, పోలీసుల వేధింపుల కారణంగా భార్య పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరి మీద దాడి జరిగినప్పుడు స్పందించకపోతే… చివరికి మీపైనా దాడికి వస్తారు.

నాడు మనం మొదలు పెట్టిన మసీదులు, షాదిఖానాలు పూర్తి చెయ్యలేదు. వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా… వక్ఫ్ బోర్డు ఆస్తులను కొట్టేస్తున్నారు. రాష్ట్రంలో 43 మంది ముస్లింలపై భౌతిక దాడులు జరిగాయి. సభలో నాటి మండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ ను కూడా దారుణంగా అవమానించారు.

ముస్లింల రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. సుప్రీం కోర్టులో దీని కోసం మీ తరఫున పోరాడుతాను” అంటూ చంద్రబాబు వివరించారు. మసీదులకు పట్టాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్న చోట సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి అమలు పరచాలని ముస్లింలు కోరగా, అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తాం అని వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/