నేటి నుండి మూడు రోజుల పాటు కుప్పం లో చంద్రబాబు పర్యటన

chandrababu kuppam tour

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుండి మూడు రోజుల పాటు కుప్పం లో పర్యటించబోతున్నారు. బుధవారం ఉదయం ఆయన హైదరాబాద్‌ నుంచి బయలుదేరి నేరుగా కుప్పం వెళ్తారు. శుక్రవారం సాయంత్రం వరకూ అక్కడ పర్యటిస్తారు. కొన్ని గ్రామాల్లో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటారు.

ఈ మూడు రోజుల పర్యటనలో ఆయన క్లస్టర్, యూనిట్ క్లస్టర్, బూత్ ఇన్ఛార్జీలతో భేటీ కానున్నారు. వారి పని తీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. అంతే కాదు పార్టీ సభ్యత్వ నమోదును కూడా సమీక్షించనున్నారు. సభ్యత్వ నమోదులో కుప్పం రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉన్న సంగతి గమనార్హం.

ముఖ్యంగా ఓటర్ల జాబితాపై పార్టీ శ్రేణులను చంద్రబాబు అప్రమత్తం చేయబోతున్నారు. అధికార పార్టీ నేతలు ఒకే వ్యక్తికి రెండు, మూడు చోట్ల ఓటు నమోదు చేయించే అవకాశం ఉందనే అనుమానాలతో… పార్టీ నేతలు, కార్యకర్తలకు పలు సూచనలు చేయబోతున్నట్టు సమాచారం. కుప్పం పరిధిలో మొత్తం 11 క్లస్టర్లు ఉండగా… ప్రతి క్లస్టర్ కు 45 నిమిషాల సమయాన్ని చంద్రబాబు కేటాయించనున్నారు. కుప్పం – పలమనేరు హైవే పక్కన నిర్మించిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కుప్పం నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతల తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. వీరిపై పార్టీ కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నేతలు , కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.