వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు

భారీ వర్షాలు , వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసాయి. ముఖ్యంగా గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. దీంతో వందల ఇల్లు నీటమునగా, కోట్ల నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ముంపు గ్రామాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు నుండి మూడు రోజుల పాటు పర్యటించబోతున్నారు. కొద్దీ సేపటి క్రితం ఏలూరుకు చేరుకున్నారు. చంద్రబాబుకు టీడీపీ నేతలు , కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో ముంపుప్రాంతాల పర్యటనకు బయల్దేరారు. గురువారం పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఐదు నియోజక వర్గాలు ఆచంట, పి.గన్నవరం, రాజోల్, పాలకొల్లు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వరద ముంపు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు.

ముందస్తుగా గోదావరి ముంచెత్తిన కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో పర్యటించాలని భావించారు. ఈ రెండు చోట్ల ఇప్పటికీ వరద నీరు ఇంకా తగ్గకపోవడం, పర్యటనకు అనువుగా తగినన్ని మార్గాలు లేకపోవడంతో వశిష్ఠ ఒడ్డున బాధితులను పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయించారు. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, రామరాజు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి సీనియర్‌ నేతలంతా వశిష్ఠ బీభత్సాన్ని చంద్రబాబుకు నివేదించారు. గోదావరి జిల్లాల్లో తొలిసారిగా చంద్రబాబు పడవలో ప్రయాణించబోతున్నారు. లంకవాసులకు ధైర్యం చెప్పడం, మరోవైపు సాయం అందేలా చేయడంలోనూ చంద్రబాబు పర్యటన ఊతమివ్వబోతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆయన పర్యటనకు వీలుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.