రాజాంలో బీసీ వర్గాలతో ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం

టిడిపి వచ్చిన తర్వాత బీసీల జీవితాలు మారాయని వెల్లడి

chandrababu-held-meeting-with-bc-cadre-in-rajam

అమరావతిః టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజాంలో బీసీ వర్గాలతో టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించగా, చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు బీసీ వర్గాలను ఉద్దేశించి ప్రసంగించారు. టీడీపీ ఆవిర్భావం ముందు… ఆవిర్భావం తరువాత బీసీల జీవితాలను చూడాలని పేర్కొన్నారు. టిడిపి ఆవిర్భావంతో రాజకీయంగా, సామాజికంగా బీసీ వర్గాల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. 50 శాతం పైగా ఉన్న బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని టిడిపి ప్రణాళికలు రూపొందించి… అమలు చేసిందని వెల్లడించారు.

నాడు కేంద్రంలో ఒక్కటే మంత్రి పదవి వస్తే… దాన్ని బీసీ వర్గానికి చెందిన ఎర్రంనాయుడుకి ఇచ్చిన చరిత్ర టిడిపిదని వివరించారు. అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కె.ఇ. కృష్ణమూర్తి, దేవేందర్ గౌడ్ వంటి బీసీ నేతలకు పదవులు ఇచ్చింది టిడిపినే అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ హయాంలోనే బీసీ కమిషన్ ఆవిర్భించింది తెలిపారు. “బీసీలలో వంశాపార్యపరంగా కులవృత్తులు, చేతి వృత్తులు వచ్చాయి. అందుకే వారి కోసం ప్రత్యేక పథకాలు తెచ్చి ఆర్థికంగా పైకి తీసుకువచ్చాం. కల్లుగీత కార్మికులు జీవితాలు చాలా దారుణంగా ఉండేవి. ప్రమాదం జరిగితే ఎవరూ ఆదుకునే వారు కాదు… కానీ టిడిపి వచ్చిన తరువాత వారిని ఆదుకున్నాం. టిడిపి వచ్చిన తరువాత కల్లుగీత కార్మికులకు 20 శాతం ప్రభుత్వ మద్యం షాపులు కేటాయిస్తాం.

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్య కారులకు పెట్రోల్ డీజిల్ సబ్సిడీ ఇచ్చి ఆదుకునేవాళ్లం. చేపలవేట విరామంలో మత్స్యకార కుటుంబాలకు బియ్యం, సరుకులు ఇచ్చి సహాయం చేశాం. మత్స్య కారుల కోసం ఆధునిక బోట్లు అందుబాటులోకి తెచ్చింది టిడిపియే.

విశ్వబ్రాహ్మణల పరిస్థితి రాష్ట్రంలో మరింత దారుణంగా ఉంది. ఒకప్పుడు రికవరీ పేరుతో వీరిపై తప్పుడు కేసులు పెట్టేవారు. మంగళసూత్రం తయారైన తర్వాతే ముహూర్తం పెట్టుకునే పరిస్థితి నాడు ఉండేది. విశ్వబ్రాహ్మణులకు అంత డిమాండ్ ఉండేది. బీసీలలో అన్ని వృత్తుల వారూ ఆర్థికంగా దెబ్బతిన్నారు. బీసీలలో 140 కులాలు ఉన్నాయి. వారందరినీ ఆదుకుంటాం. వీటి కోసమే 54 బిసి సాధికార కమిటీలు వేశాం.

బీసీల పథకాలకు డబ్బులు లేవు కానీ… సాక్షి పేపర్ కు ప్రకటనల కోసం మాత్రం వందల కోట్లు ఇస్తున్నారు. స్కూళ్లలో సాక్షి పేపర్ తప్ప మరో పేపర్ లేదని స్వయంగా కోర్టు ఆక్షేపించింది. ఉత్తరాంధ్రంలో ఇప్పుడు జగన్ ఎవరిని పెట్టారు… సాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి? దీనిపై బొత్స ఎందుకు అడగలేకపోతున్నాడు? జగన్ కంటే ముందు పీసీసీ అధ్యక్షుడు అయిన బొత్స… ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మంత్రిగా ఉన్న అధర్మాన ఏం చేస్తున్నాడు.? పెద్దిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, సజ్జల వంటి వారిని పెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తారా?

మన బీసీలు అయిన సుధాకర్ యాదవ్ వంటి వారిని టిడిపి బోర్డు చైర్మన్ ను చేశాం. జగన్ బీసీలకు పదవులు ఇవ్వడు గాని… వారి ఒట్లు మాత్రం కావాలి. బీసీలకు ఆదరణ కోసం తెచ్చిన రూ.300 కోట్ల విలువ చేసే పరికరాలు తప్పు పట్టిపోతున్నా ఇవ్వలేదు. ఉత్తరాంధ్రలో తోటపల్లిలో ప్రారంభించింది నేనే… పూర్తి చేసింది నేనే. మద్దివలస ప్రాజెక్టను మనమే పూర్తి చేశాం. ఉత్తరాంధ్రలో ధాన్యం కొనే పరిస్థితి లేదు. ధాన్యం కొనడం లేదు గానీ… మోటార్లకు మీటర్లు పెడుతున్నారు.

కొల్లు రవీంద్రలాంటి వారిపై అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారు. జగన్ రెడ్డీ నిన్ను జైల్లో వెయ్యలేమా? అజాత శత్రువు లాంటి కొల్లు రవీంద్రపై కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతారా? అచ్చెన్నాయుడుపైనా అక్రమ కేసు పెట్టిన జగన్ రెడ్డి ఏం పీకాడు? 72 రోజులు అచ్చెన్నను జైల్లో పెట్టావు. జగన్ జైల్లో ఉన్నాడు కాబట్టి… అందరూ జైల్లో ఉండాలి అని అంటున్నారు. చివరికి కళా వెంకటరావు, అయ్యన్న పాత్రుడుపైనా కేసులు పెట్టారు. 72 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టిన జగన్ ను ఏమనాలి?

బీసీ మహిళ గౌతు శిరీషపైనా కేసులు పెట్టారు. గౌతు లచ్చన్న లాంటి కుటుంబ సభ్యురాలిపై కేసు పెట్టారు. గౌతు లచ్చన్న కుటుంబం అంటే కూడా గౌరవం లేదా? కూన రవిపై అయితే కేసులే కేసులు… బీసీలపై కక్ష సాధించిన నిన్ను ఇంటికి పంపడం ఖాయం. ఇంత దారుణాలు చేసిన జగన్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దాం. బీసీలకు జగన్ హయాంలో అన్యాయం జరుగుతోంది. ఈ నష్టాన్నంతా పూర్తి చేసేది తెలుగు దేశమే. నన్ను 40 ఏళ్లు ఆదరించి గౌరవించిన బీసీలకు న్యాయం చేస్తా. పార్టీ బీసీ సాధికార కమిటీ ద్వారా బీసీల కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

తాజ తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/