కేశినేని, బుద్ధా వెంకన్నపై చంద్రబాబు ఆగ్రహం

సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

అమరావతి: విజయవాడ టిడిపిలో వ్యక్తిగత విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గురించి మాట్లాడినా, వ్యక్తిగత విమర్శలు చేసుకున్నా సహించేది లేదని హెచ్చరించారు. నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటే పార్టీకి ఇబ్బందులు వస్తాయని ఆయన అన్నారు.

వివాదం విషయంలోకి వెళ్తే… 39వ డివిజన్ నుంచి టిడిపి కార్పొరేటర్ అభ్యర్థిగా గుండారపు పూజితను కాదని… వైఎస్‌ఆర్‌సిపి నుంచి టిడిపిలోకి వచ్చిన వ్యక్తికి కేశినేని నాని టికెట్ ఇవ్వడంతో వివాదం రాజుకుంది. నాని నిర్ణయంపై బుద్ధా వెంకన్న వర్గీయులు మండిపడ్డారు. కేశినేని నానిని గుండారపు హరిబాబు, ఆయన కుమార్తె పూజితలు అడ్డుకుని నిలదీశారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న తమను కాదని, ఇతరులకు టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. బీసీలమైన తమకు అన్యాయం చేయడం సబబు కాదని మండిపడ్డారు.

గత కొంత కాలంగా కేశినేని నానికి, ఇతర స్థానిక నేతలైన బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా తదితరులకు దూరం పెరుగుతూ వస్తోంది. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో చివరకు చంద్రబాబు రంగంలోకి దిగారు. 39వ డివిజన్ అభ్యర్థి అంశాన్ని పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అప్పగించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/