ఎంత మందిని చంపుతారు? చంపేస్తారా అందర్నీ?
పట్టాభిపై దాడికి జగన్ సమాధానం చెప్పాలి..చంద్రబాబు
విజయవాడ: టిడిపి నేత పట్టాభిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడి అనంతరం పట్టాభిని టిడిపి అధినేత చంద్రబాబు పట్టాభిని ఆయన నివాసంలో పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓ మంత్రి, ఇంకొంత మంది రౌడీలు రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సిపి నేతలు గూండాలుగా తయారైపోయారు. వారికి కళ్లు నెత్తికెక్కి ఏమైనా చేయగలమని భావిస్తున్నారు. కొంత మంది కలిసి ఓ పథకం కూడా వేశారు. పట్టాభిపై దాడికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
‘ప్రభుత్వ అవినీతిని పట్టాభి ప్రశ్నిస్తున్నారు అందుకే ఆయనపై దాడులకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సిపి నేతలు బరి తెగించి దాడులు చేస్తున్నారు. పట్టాభిని చంపాలనే దాడి చేశారు. ఇంతకు ముందు కూడా పట్టాభిపై దాడి జరిగింది. ఈ కాలనీలో ప్రతి ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ‘దీన్ని బట్టి ఆ ప్రాంతంలో దాడులు అధికంగా జరుగుతున్నాయని తెలుసుకోవచ్చు పట్టాభిని చంపే ప్రయత్నం చేశారు. ఇనుప రాడ్లు, ఇతర మారణాయుధాలతో దుండగులు వచ్చి దాడి చేశారు. డ్రైవర్ ను బయటకు లాగేశారు. పట్టాభి బలంగా ఉంటారు కాబట్టి తట్టుకోగలిగారు. వేరే వారయితే తట్టుకోలేకపోయే వారు. వైఎస్ఆర్సిపి నేతలు ఏమనుకుంటున్నారు?’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
‘ఈ దాడి ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఓ వైపు దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. మరోవైపు, నేతలపై దాడులు చేస్తున్నారు. టిడిపి నేతలందరూ వైఎస్ఆర్సిపి దాడులను ఎండగడుతున్నారు. దీంతో వైఎస్ఆర్సిపి నేతలు టిడిపి నేతలపై దాడులకు దిగుతున్నారు. ఇది పులివెందుల కాదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’ అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ‘దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓ వైపు టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఇక్కడ పట్టాభిపై దాడి చేశారు. ప్రజాస్వామ్యంపై దాడి అంటే ఇది ప్రజలపై దాడి. ప్రజల కోసం పోరాడుతోన్న వారిపై దాడులు చేస్తారా? ఎంత మందిని చంపుతారు? చంపేస్తారా అందర్నీ? చంపండి చూస్తాం. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి’ అని చంద్రబాబు నాయుడు చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/