విజయసాయి ని ఓదార్చిన చంద్రబాబు

వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి ని టీడీపీ అధినేత చంద్రబాబు ఓదార్చారు. నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. 23 రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న గుండెపోటుకు గురయ్యారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం బెంగుళూర్ లోని నారాయణ హృదయాల హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ తారకరత్న ఆరోగ్యం కుదుట పడలేదు. శనివారం తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం తారకరత్న భౌతికాయాన్ని రంగారెడ్డి జిల్లా మోకిలలోని తన నివాసానికి తరలించారు. దీంతో తారకరత్న ను కడసారి చూసేందుకు సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తారకరత్న నివాసానికి వచ్చిన చంద్రబాబు దంపతులు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించి , కటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని చంద్రబాబు పలకరించారు. తారకరత్న ట్రీట్ మెంట్ గురించి విజయసాయిరెడ్డి చంద్రబాబుకు వివరించారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. తారకరత్న భార్య అలేఖ్య, విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతురు. దీంతో విజయసాయి కి తారకరత్న కుటుంబానికి దగ్గరి సంబధం ఉంది. తారకరత్న ఆస్పత్రిలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి వెళ్లి పరామర్శించారు. తారకరత్నను దగ్గరుండి చూసుకున్న బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అలాగే ఉదయం కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లు సైతం నివాళ్లు అర్పించడం జరిగింది.