చండీగఢ్ ఎయిర్పోర్ట్కు భగత్ సింగ్ పేరు
చండీగఢ్లోని ఎయిర్పోర్టు పేరు.. ఇకపై షహీద్ భగత్సింగ్ విమానాశ్రయంగా మారనుంది. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సెప్టెంబర్ 28న ఆయన జయంతి నేపథ్యంలో.. ఆ స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఆదివారం ‘మన్ కీ బాత్’ 93వ ఎపిసోడ్లో ప్రధాని మాట్లాడారు. ‘చీతాలు తిరిగి రావడం పట్ల దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు. 130 కోట్ల మంది భారతీయులు ఉప్పొంగిపోయారు. ఒక టాస్క్ ఫోర్స్ ఈ చీతాలను పర్యవేక్షిస్తుంది. అది ఇచ్చే రిపోర్టు ఆధారంగా చీతాలను ప్రజలు ఎప్పుడు సందర్శించవచ్చో నిర్ణయిస్తాం’ అని ప్రధాని మోడీ అన్నారు.
దశాబ్దాల తర్వాత చీతాలు తిరిగి భారత్లో అడుగుపెట్టడం 130 కోట్ల భారతీయులకు గర్వకారణమన్నారు. ప్రస్తుతం చీతాలు టాస్క్ఫోర్స్ పర్యవేక్షణలో ఉన్నాయని.. త్వరలోనే వాటిని చూసేందుకు ప్రజలకు అనుమతిస్తామని చెప్పారు. చీతాలకు కొత్త పేర్లు సూచించాలని ప్రజలను కోరారు. అలాగే జంతువుల పట్ల మనుషులు ఎలా ప్రవర్తించాలనే విషయంపైనా సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో పాల్గొన్నవారికి మొదట చీతాలను చూసే అవకాశం కల్పిస్తామని అన్నారు.