టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమితులయ్యారు. కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారని… వారి కోసం గత మూడేళ్లుగా వివిధ పారాయణాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి చాగంటిని సలహాదారుగా నియమించామని తెలిపారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో నిన్న ఎస్వీబీసీ, హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలోనే చాగంటిని సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. గ్రామస్తులకు భజన, కోలాటం కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని అందజేస్తామని పేర్కొన్నారు.మానవాళి శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ యాగాలు, హోమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలుగు, తమిళ చానళ్ల తరహాలో కన్నడ, హిందీ చానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించామని సుబ్బారెడ్డి తెలిపారు.