బీజేపీలో చేరిన సీహెచ్ విఠల్…కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: ఉద్యమ పునాదులపై ఏర్పడిన టీఆర్ఎస్‌ పార్టీలో ఇప్పుడు తెలంగాణ ద్రోహులదే ఆధిపత్యంగా మారిందని తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్‌.విఠల్‌ అన్నారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి ముక్తార్ అబ్సాస్ నఖ్వీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం భర్తీ చేయకుండా మీనమేషలు లెక్కపెడుతోందని మండిపడ్డారు. ఉద్యమకారులకు, మహిళలకు, విద్యావంతులకు టీఆర్ఎస్‌ సరైన గౌరవం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరితో ఏడేళ్లలో 600 మంది యువకులు బలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని విఠల్ ధీమా వ్యక్తం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/