దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. ఆంక్షలను సడలించిన కేంద్రం

స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలన్న కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. కొన్ని రోజుల క్రితం రోజుకు లక్షకు పైగా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య వేలకు పడిపోయింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య వందల్లోకి తగ్గనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ కు సంబంధించి మార్గదర్శకాలను సడలించింది. కరోనా ఆంక్షలకు మినహాయింపులు ఇస్తున్నట్టు కేంద్రం తెలిపింది. రాత్రి పూట కర్ఫ్యూలను సడలించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఎంటర్టైన్ మెంట్, క్రీడలు, ఫంక్షన్లు, సోషల్ గ్యాదరింగ్స్, మతపరమైన వేడుకలు తదితరాలపై విధించిన ఆంక్షలను సడలించాలని చెప్పింది.

కోవిడ్ తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలిస్తున్నట్టు కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆంక్షలను అమలు చేయాలని రాష్ట్రాలు, యూటీలకు ఆయన సూచించారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్, రెస్టారెంట్లు, బార్లు, స్కూళ్లు, కాలేజీలు, జిమ్ లు, కార్యాలయాలను తెరవడంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు అన్ని జాగ్రత్తలను యథావిధిగా పాటించాలని ఆయన కోరారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇళ్లు, అన్ని చోట్ల సరైనంత వెంటిలేషన్ వచ్చేలా చూసుకోవడం చేయాలని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాలని తెలిపారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని కంటిన్యూ చేయాలని సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/