రైతులతో చర్చలు..ప్రతిపాదనలు పంపిన కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైతు సంఘాల నేతలకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా ప్రతిపాదలను పంపింది. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులను అడ్డుకోవడంతో శివారులోని సింఘు సరిహద్దు వద్దనే నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నేతలతో మరో విడత చర్చలకు ముందుగా ప్రతిపాదనలను కేంద్రం ప్రభుత్వం బుధవారం వారికి పంపింది. దీంతో దీనిపై తాము చర్చిస్తామని బీకేయూ రాష్ట్ర అధ్యక్షుడు మంజిత్ సింగ్ తెలిపారు.
అయితే మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ఇదే తమ ప్రధాన డిమాండ్ అని కిసాన్ సంఘర్ష్ కమిటీకి చెందిన కన్వాల్ప్రీత్ సింగ్ చెప్పారు. కేవలం సవరణలపై మాత్రమే చర్చలు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తాము తిరస్కరిస్తామని వెల్లడించారు.
రైతులు మంగళవారం చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనూహ్యంగా రంగంలోకి దిగి రైతు సంఘం నాయకులతో చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం రైతుల మధ్య నేడు మరో దఫా చర్చలు జరుగనున్న వేళ ప్రభుత్వం రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/