75వ స్వాతంత్ర్య దినోత్సవానికి 259 మందితో జాతీయ కమిటీ

సభ్యులుగా కేసీఆర్, జగన్, చంద్రబాబు, రామోజీరావులకు చోటు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే 75వ స్వాతంత్ర్య దినోత్సవం కోసం ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో ఏర్పాటైన జాతీయ కమిటీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖలకు చోటు లభించింది. మొత్తం 259 మంది ఉన్న ఈ కమిటీలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, అజిత్ ధోవల్, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సీనీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు, దర్శకుడు రాజమౌళి, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, మిథాలీరాజ్ తదితరులకు చోటు కల్పించారు. అలాగే, సినీ రంగం నుంచి రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఏఆర్ రహమాన్, లతామంగేష్కర్, ఇళయరాజా, ఏసుదాస్ తదితరులకు చోటు దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎలా నిర్వహించాలి? ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి? అన్న దానిని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఎల్లుండి ఈ కమిటీ తొలిసారి సమావేశం అవుతుంది.

తాజా అంతర్జాతీయ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/