రేపు హైదరాబాద్‌కు రానున్న కేంద్ర బృందం

హైద‌రాబాద్‌లో వ‌ర‌ద న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు రానున్న కేంద్ర బృందం

Heavy rain

హైదరాబాద్‌: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో రూ.వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు రాష్ర్ట ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది. తక్షణ సహాయంగా రూ.1350 కోట్లను విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడికి సిఎం కెసిఆర్‌ లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర బృందం రేపు సాయంత్రం హైద‌రాబాద్‌కు రానుంది. వ‌ర‌ద న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు న‌గ‌రానికి కేంద్రం బృందం వచ్చి రెండు రోజుల పాటు హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. నష్టం తీవ్రతను అంచ‌నా వేయ‌నున్నారు.

కాగా ఇప్ప‌టికే న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణ సాయం కింద సిఎం కెసిఆర్‌ రూ. 550 కోట్ల సాయం ప్ర‌క‌టించారు. వ‌ర‌ద ప్ర‌భావిత‌మైన కుటంబాల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇక ఢిల్లీ ప్ర‌భుత్వం రూ. 15 కోట్లు, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 10 కోట్లు, ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం రూ. 2 కోట్లు, మై హోం సంస్థ రూ. 5 కోట్లు, చిరంజీవి, మ‌హేశ్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ రూ. కోటి చొప్పున రాష్ర్ట ప్ర‌భుత్వానికి విరాళం అందించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/