మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సోషల్ మీడియా లో ఓ పోస్ట్ కలకలం

హైదరాబాద్ లో జులై 02 న జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హైదరాబాద్ కు రాబోతున్నారు. అలాగే జులై 03 సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో బిజెపి భారీ బహిరంగ సమావేశం జరపబోతుంది. ఈ సభ లో మోడీ ప్రసంగించనున్నారు. ఈ తరుణంలో పోలీసులు పటిష్టమైన కట్టుదిట్టం చేసారు. ఇందులో భాగంగా పాతబస్తీలో మాజిద్‌ అట్టర్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే, నుపుర్‌ శర్మ ఘటనపై అట్టర్‌.. ఫేసుబుక్‌లో పోస్ట్‌ పెట్టడం కలకలం సృష్టించింది. నుపుర్‌ శర్మ వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ క్షమాపణలు చెప్పాలని మాజిద్‌ డిమాండ్‌ చేశాడు. లేకపోతే నిరసనలకు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సోషల్‌ మీడియా పోస్టులో రాసుకొచ్చాడు. దీంతో, రంగంలోకి దిగిన మొఘల్‌పురా పోలీసులు మాజిద్‌ అట్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో పోస్టులపై పోలీసులు నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. నోవాటెల్, పరేడ్ గ్రౌండ్, రాజ్‌భవన్ పరిసరాల్లో నో ఫ్లైయింగ్ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ పై పోలీసులు నిషేధం విధించారు.