తెలంగాణ కు కేంద్రం తీపి కబురు..పర్యాటక అభివృద్ధి కోసం రూ.300 కోట్లు మంజూరు

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తీపి కబురు అందజేసింది. తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల నిర్మాణానికి స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద కేంద్రం రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. స్వదేశ్ దర్శన్ పథకంలో రాష్ట్రంలో మూడు పర్యాటక సర్క్యూట్స్ అభివృద్ధికి రూ.268.39 కోట్లు, ప్రసాద్ పథకం కింద రూ.36.73 కోట్ల మంజూరు చేసింది. బిజెపి తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాసిన లేఖకు సమాధానమిస్తు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.

ఆ వివరాలను బట్టి చూస్తే..మహబూబ్ నగర్ జిల్లాలోని ఎకో సర్క్యూట్ కోసం 2015-16లో రూ.91.62 కోట్లు, ములుగు-లక్నవరం-మేడారం-తాడ్వయి-దామరవి-మల్లూరు-బొగత జలపాతంను కలుపుతూ ట్రైబల్ సర్క్యూట్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు 2016-17లో రూ.79.87 కోట్లు, కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్-పైగా టూంబ్స్- హయత్ బక్షి మస్క్ –రేమండ్స్ టూంబ్ లను కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు 2017-18లో రూ.96.90 కోట్లు మంజూరు చేసినట్టు లేఖలో పేర్కొన్నారు.

అలాగే ప్రసాద్ పథకం కింద ఆలంపూర్ లోని జోగులాంబ దేవి అమ్మవారి దేవాలయం అభివృద్ధికి 2020-21లో రూ.36.73 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపిస్తే, వాటిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి లేఖలో పేర్కొన్నారు.