నేడే కేంద్ర కేబినెట్ విస్తరణ

ఏపీ, తెలంగాణ నుంచి పలువురు ఆశావహులు

న్యూఢిల్లీ : నేడు కేంద్ర కేబినెట్‌ను విస్తరించనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలు కొండంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం ఏడుగురు లోక్‌సభ, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగువాడైన జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనతో కలుపుకుంటే మొత్తం 8 మంది తెలుగు వారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క కిషన్ రెడ్డికి మాత్రమే మంత్రి పదవి లభించింది.

దీంతో ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి మరికొందరికి కేబినెట్ బెర్తులు దక్కొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీలో చేరినప్పుడు హామీ ఇచ్చినట్టుగా చెబుతున్న కర్నూలు నేత టీజీ వెంకటేశ్‌కు రాత్రి వరకు ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో ఇక ఆశలు లేనట్టే. సీఎం రమేశ్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వేర్వేరు పనుల నిమిత్తం ఢిల్లీలోనే ఉన్నారు.

ఇక, ఏపీలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో ఆ రాష్ట్రానికి ఎలాంటి పదవులు దక్కకపోవచ్చు. కేబినెట్‌లో గిరిజనులకు ప్రాధాన్యం కల్పించాలనుకుంటే కనుక సోయం బాపూరావుకు అవకాశం ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయనకు కూడా అధిష్ఠానం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పిలుపు రాకపోవడం గమనార్హం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/