జనవరి 4న మళ్లీ రైతు సంఘాలతో కేంద్రం భేటి

నిన్న రైతు సంఘాలతో 5 గంటలపాటు ప్రభుత్వం చర్చలు
కరెంటు చార్జీలు, పంటవ్యర్థాల జరిమానా అంశాల్లో ఏకాభిప్రాయం

talks-between-govt-and-farmers-held-for-5-hours

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత 35 రోజులుగా రైతులు నిరసన దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నిన్న ఐదు గంటలపాటు రైతులతో చర్చలు జరిపింది. వచ్చే నెల 4న మరోమారు చర్చలు జరపాలని రైతు సంఘాలు, ప్రభుత్వం నిర్ణయించాయి. రైతుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కనీస మద్దతు ధరపై కమిటీ వేసేందుకు, విద్యుత్ బిల్లులను పెండింగులో పెట్టేందుకు అంగీకరించింది.

మిగతా డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని, కాబట్టి ఆందోళన విరమించాలని రైతులను కోరింది. అయితే, రైతులు మాత్రం అందుకు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని, అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పినట్టు సమాచారం. కాగా, రైతు సంఘాలతో ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరుసార్లు చర్చలు జరిపినప్పటికీ ఏ సంగతీ తేలకుండా అసంపూర్ణంగానే ముగిశాయి.


తాజా తెలంగాణ వార్త లకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/