ఏపీకి పన్నుల వాటా నిధులను విడుదల చేసిన కేంద్రం

ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్న ఏపీ సర్కార్ ను ఆదుకుంది కేంద్రం. పన్నుల వాటా రూ. 4721 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రాల నుండి GST రూపంలో వసూలు చేసిన పన్నులలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వాటాను విడుదల చేసింది. ఏపీకి రూ. 4721 కోట్లను విడుదల చేయగా..తెలంగాణకు రూ. 2452 కోట్లను, ఛత్తీస్‌గఢ్‌కు రూ.3,974.82 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.9,158.24 కోట్లు , పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి రెండు విడతల పన్నుల పంపిణీలో రూ.8,776.76 కోట్లు నిధులు విడుదల చేసింది. ఇక గుజరాత్‌కు రూ.4,057.64 కోట్లు, హర్యానాకు రూ. 1,275.14 కోట్లు,మహారాష్ట్రకు రూ.7,369.76 కోట్లు, రాజస్థాన్‌కు రూ.7,030.28 కోట్లు, తమిళనాడుకు రూ.4,758.78 కోట్లు నిధులు విడుదల అయినట్లుగా తెలుస్తుంది.

ఇదిలా ఉంటె రాష్ట్రానికి కేంద్ర ఇవ్వవలసిన అనేక నిధులు ఏడాది కాలంగా పెండింగ్ ఉన్నాయని ఏపీ సర్కార్ పేర్కొంది. స్థానిక సంస్థలకు ఇంతవరకూ గత ఏడాది రెండో విడత 15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదని వెల్లడించింది. గ్రామ పంచాయతీలకు 678.65 కోట్లు, మండల జిల్లా పరిషత్ లకు 290. 86 కోట్లు మొత్తంగా బకాయిలు 969 కోట్ల రూపాయలు విడుదల కాలేదని పేర్కొంది. వీటికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి విడతలో వెయ్యి కోట్లు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న నిధులను ప్రస్తావించింది.