సిరివెన్నెల మృతి ఫై సినీ, రాజకీయ ప్రముఖులు ఏ విధంగా స్పందించారంటే ..
సిరివెన్నెల ఇక లేరు అనేది ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. సినీ ప్రముఖులు మాత్రమే కాదు రాజకీయ నేతలు సైతం సిరివెన్నెల పాటలను గుర్తుచేసుకుంటున్నారు. ఎవరెవరు ఎలా స్పదించారో ఓసారి చూద్దాం.
- ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం కేసీఆర్ అన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
- తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ‘‘అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు.
- సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమయం పట్ల మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్, జగదీష్రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. సీతారామ శాస్త్రి సాహిత్య రంగానికి చేసిన సేవ మరచిపోలేనిదని, ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. భౌతికంగా మరణించినా..ఆయన పాటలతో చిరకాలం చిరంజీవిలా బ్రతికే ఉంటారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
- సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానన్నారు. త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో మరణవార్త వినాల్సిరావడం విచారకరమన్నారు. సిరివెన్నల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు.
- ‘జగమంత కుటుంబం మీది మీరు లేక ఏకాకి జీవితం మాది…మా జీవితాలకు అర్థాన్ని జోడించిన మీ కవితా భావనలకు ధన్యవాదాలు.. మీరు ఉత్తమ గురూజీ భరించలేని నష్టం..’ అంటూ ట్విటర్ లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు ప్రకాశ్రాజ్.
- తెలుగు సాహిత్యం ఒక్కసారిగా మూగబోయినట్టు అనిపిస్తుంది..మన పాట ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయిందా..?మనసుకి నొప్పిగా ఉంది గురువుగారు..అంటూ ఆర్పీ పట్నాయక్ తన సంతాప సందేశంలో తెలిపారు.
- సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా..రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి..అని సిరివెన్నెల ఫొటోతో ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
- సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరనే వార్త విని చాలా నిరుత్సాహపడ్డాను. ఆయన ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా..సిరివెన్నెల ఆత్మక శాంతి కలుగుగాక..అంటూ వెంకటేశ్ ట్వీట్ చేశాడు.
- మా పరిశ్రమకు మీరు చేసిన అసమానమైన సహకారానికి ధన్యవాదాలు. మీరు చిరస్థాయిగా గుర్తుండిపోతారు. మీతో కలిసి పనిచేయడం ఎంతో గౌరవం. ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ హీరో రామ్ ట్వీట్ చేశాడు.