మంత్రి మేకపాటి మృతిపై చంద్రబాబు సహా ప్రముఖుల దిగ్భ్రాంతి
తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను: లోకేశ్
అమరావతి : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి మృతి కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి మృతి బాధాకరం అన్నారు. మంత్రివర్గం లో మృదు స్వభావిగా, హుందాగా వ్యవహరిస్తూ గౌతమ్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు.
‘మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఫిట్నెస్కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే మంత్రి గారికి గుండెపోటు రావడం అత్యంత విచారకరం. విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి వచ్చినా వినయం, విధేయతలు ఆయన చిరునామా. ఐదుపదుల వయస్సులోనే హుందా గల రాజకీయవేత్తగా పేరుగాంచిన మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మనకి దూరం కావడం తీరని విషాదం. మేకపాటి గౌతమ్రెడ్డి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
‘ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం బాధాకరం. వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలుపుతున్నాను’ అని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
‘ఆసుపత్రికి ఫోన్ చేశాను. ఆయన మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నిన్న రాత్రి కూడా ఆయన చాలా చురుకుగా ఉన్నారు. ఈ రోజు గౌతం లేరన్న వార్త బాధ కలిగిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, వైస్సార్సీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మేకపాటి గౌతం రెడ్డి చాలా యాక్టివ్గా ఉండేవారని, ఏపీ మంత్రి వర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/