పీవీ నరసింహారావు కు ప్ర‌ముఖుల నివాళులు

హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. ‘భారత మాజీ ప్రధానమంత్రి, రాజనీతిజ్ఞుడు, క్రాంతదర్శి, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను’ అని ఉప రాష్ట్రప‌తి వెంక‌య్యనాయుడు ట్వీట్ చేశారు. ‘స్వావలంబన, స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తూ దేశ భవిష్యత్తుకు బాటలు పరచిన పీవీ, మాతృభాషకు సైతం అంతే ప్రాధాన్యతనిచ్చారు. విశాల దృష్టితో వీక్షించి, దేశానికి వారు అందించిన సేవలను జాతి యావత్తు చిరకాలం గుర్తు పెట్టుకుంటుంది’ అని ఆయ‌న అన్నారు.

దేశానికి పీవీ చేసిన సేవలు చిరస్మరణీయమ‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతమ‌ని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు.

‘ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు, బహుభాషా కోవిదులు, తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పోస్టు చేశారు.

తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహారావు గారంటూ తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు ట్వీట్ చేశారు. ‘ఆలోచనాపరునిగా, సాహితీ వేత్తగా, బహు భాషా కోవిదునిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ అమోఘం, అనితర సాధ్యం. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారత దేశానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. ఆ మహానీయుని శతజయంతి సందర్భంగా తెలంగాణ ఠీవీ.. మన పీవీని ఘనంగా స్మరించుకుందాం. ఘన నివాళులు అర్పిద్దాం’ అని పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/