వివేకా హత్య కేసులో 12వ రోజుకు సీబీఐ విచారణ
విచారణకు చిన్నప్పరెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మీరెడ్డి హాజరు
కడప: : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ 12వ రోజూ కొనసాగుతోంది. సీబీఐ విచారణకు నేడు ఆరుగురు అనుమానితులు హాజరయ్యారు. వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే, పులివెందులకు చెందిన చిన్నప్పరెడ్డి, రామచంద్రారెడ్డి, కడపలోని మోహన్ ఆసుపత్రి యజమాని లక్ష్మీరెడ్డి, పులివెందులకు చెందిన కాఫీ పొడి వ్యాపారి సుగుణాకర్, సింహాద్రి పురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వర్రెడ్డి విచారణకు హాజరయ్యారు. జగదీశ్వర్రెడ్డి వరుసగా మూడో రోజు విచారణకు హాజరయ్యాడు. గతంలో వివేకాకు జగదీశ్వర్ రెడ్డి పీఏగా పనిచేశాడు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఈ విచారణ కొనసాగుతోంది.
కాగా, ఇప్పటికే వివేక హత్య కేసులో అనుమానితులుగా ఉన్న పలువురిని అధికారులు ప్రశ్నించి పలు వివరాలు రాబట్టిన విషయం తెలిసిందే.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/