గంగిరెడ్డి కీలక నిందితుడు..బెయిల్ రద్దు చేయండిః హైకోర్టులో సీబీఐ పిటిషన్

TS High Court
TS High Court

హైదరాబాద్‌ః మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి కీలక నిందితుడు అని, అతడి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తెలంగాణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా, ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది. సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నాగేంద్ర, అనిల్ వాదనలు వినిపించారు.

వివేకాను అంతమొందించేందుకు కుట్ర, హత్య చేయడంలో గంగిరెడ్డిది కీలకపాత్ర అని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన సిట్ చార్జిషీటు వేయకపోవడం వల్లే గంగిరెడ్డికి బెయిల్ లభించిందని సీబీఐ వివరించింది. ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉందని, అందుకే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నామని కోర్టుకు విన్నవించింది.

ఇక, గంగిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. గతంలో అన్నీ పరిశీలించాకే ఏపీ హైకోర్టు బెయిల్ రద్దు చేసేందుకు నిరాకరించిందని తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. సాక్షులను ప్రభావితం చేస్తారన్న అనుమానంతో బెయిల్ రద్దు చేయరాదని పేర్కొన్నారు. అటు, వివేకా కుమార్తె సునీత తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. గంగరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ వాదనలను సునీత న్యాయవాది సమర్థించారు.