మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు కేసు నమోదు

మంత్రి మల్లారెడ్డి ఫై ఐటి అధికారులు కేసు నమోదు చేసారు. అధికారులు తన కొడుకును కొట్టారని మంత్రి మల్లారెడ్డి బుధవారం ఆరోపించగా.. గురువారం తమపైనే మల్లారెడ్డి దాడి చేశారని ఐటీ అధికారులు ప్రతి ఆరోపణలు చేశారు. ఈమేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంత్రి తమపై దాడి చేసి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు గుంజుకున్నారని ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోదాల సందర్భంగా తాము సేకరించిన సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించారు. ల్యాప్ టాప్ తెచ్చి ఇచ్చినా ఐటీ సిబ్బంది దానిని తీసుకోలేదు. అది తమ ల్యాప్ టాప్ కాదని చెప్పడంతో దానిని పోలీస్ స్టేషన్ లో భద్రపరిచినట్లు సమాచారం. అలాగే మల్లారెడ్డిపై అధికారులు పలు ఆరోపణలు చేసారు. సివిల్ సర్వెంట్‌ విధులకు ఆటంకం కలిగించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, అసభ్యపదజాలంతో దూషించడం , ల్యాప్‌టాప్‌, ఫోన్‌లను లాక్కోవడం , సాక్ష్యాలు, ఆధారాలను ధ్వంసం చేయడం వంటి ఆరోపణలు చేసారు.

ఇక రెండు రోజుల పాటు మల్లారెడ్డి ఆస్తులపై ఐటి అధికారులు అరా తీశారు. హైదరాబాద్ ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్నాటక నుంచి వచ్చిన 400 మంది.. 65 బృందాలుగా విడిపోయి రెండురోజులపాటు సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు 10.50 కోట్లు సీజ్‌ చేసినట్టు సమాచారం.