పక్క దేశాలను చూసైనా తీరు మార్చుకోవాలిః రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని హెచ్చరిక

ఇష్టారీతిన అప్పులు చేసి..భావితరాల భుజాలపై రుణభారం మోపడం తగదన్న మోడీ

careless-spending-will-ruin-our-kids-future-warns-pm-modi

న్యూఢిల్లీః అప్పులు తెచ్చి ఎడాపెడా ఖర్చు చేస్తే భవిష్యత్ తరాలపై మోయలేనంత రుణభారం పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. గురువారం రాజ్యసభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు వ్యయ నియంత్రణపై సీరియస్ గా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పు పుడుతోంది కదా అని అన్నిచోట్లా రుణం తీసుకుని, దుబారా ఖర్చులు చేస్తే పొరుగు దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకూ తప్పదని హెచ్చరించారు.

తమ పదవీకాంక్షతో భావితరాలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని కొంతమంది నేతలను ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేసేందుకు సిద్ధపడుతున్న విషయాన్ని మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. పంజాబ్ ఇప్పటికే ఓపీఎస్ ను తిరిగి అమలు చేస్తోంది. ఓట్ల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలు కోసం అందినకాడల్లా అప్పులు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.