ఏకాగ్రత దెబ్బతింటే మ్యాచ్ మీద దృష్టి అసాధ్యం

బెంగళూరు : జట్టులో హేమాహేమీ బ్యాట్స్మెన్లు, పదునైన బౌలర్లున్నా.. పేరున్న కోచ్ ఉన్నా ఆ జట్టు మాత్రం పాత దారిలోనే పయనిస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తాజాగా దిల్లీ జట్టుతో మ్యాచ్లో ఓడిపోయింది. గెలుపు ఆ జట్టుకు అందని ద్రాక్షే అయింది. వెరసి ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. అయితే జట్టు ప్రదర్శనపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఆ జట్టు సారథి మాత్రం మరోలా స్పందిస్తున్నాడు.
‘జట్టు ఓటములపై వివరణ ఇవ్వడానికి ఇంకా ఏం మిగల్లేదు. ప్రతి ఓటమిపై క్షమాపణ కోరాల్సిన పనిలేదు. ఏకాగ్రత దెబ్బతింటే మ్యాచ్ మీద దృష్టి పెట్టడం అసాధ్యం. మ్యాచులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మేం ముందుగానే సూచించాం. కానీ అది జరగలేదు. జట్టుకు మీరు సూచించడానికి ఇంకా ఏం లేవు. జట్టుగా ఆటను ఆస్వాదించాలి. లేకపోతే క్రికెట్ ఆడలేము’ అని విరాట్ కోహ్లీ అన్నాడు.