4 రెట్ల ఆక్సిజన్ ను తీసుకుందనడం సరి కాదు

ఇది మధ్యంతర నివేదికే..తుది నివేదిక వచ్చేదాకా ఆగాలి..గులేరియా

న్యూఢిల్లీ: కరోనా సమయంలో ఢిల్లీ ప్రభుత్వం 4 రెట్ల ఆక్సిజన్ ను తీసుకుందనడం సరి కాదని ఎయిమ్స్ అధిపతి డాక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. సుప్రీం కోర్టు నియమించిన ఆక్సిజన్ ఆడిట్ సబ్ కమిటీకి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. ఢిల్లీ 4 రెట్ల ఆక్సిజన్ ను అదనంగా తీసుకుందని నిన్న ఆ సబ్ కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గులేరియా దానిపై స్పందించారు. అది కేవలం మధ్యంతర నివేదికేనని, తుది నివేదిక వచ్చే వరకు ఆగాలని సూచించారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఏం చెబుతుందో వేచి చూడాలని ఆయన అన్నారు. యాక్టివ్ కేసులను తక్కువగా లెక్కించడం, ఇతర కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, బహుశా థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని గులేరియా అన్నారు. అయినా సరే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనాను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. సెకండ్ వేవ్ నేర్పిన పాఠాలతో మూడోవేవ్ కు సిద్ధమవ్వాలన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ ను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, ప్రస్తుత భయమంతా డెల్టా వేరియంట్ తోనేనని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/