కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా రద్దు
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటాను రద్దయ్యింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయాల నిర్వహణను పర్యవేక్షిస్తున్న కేంద్రీయ విద్యాలయ సంఘటన్ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ సభ్యులతో పాటు ఇతర కోటాల కింద భర్తీ చేసే సీట్ల భర్తీ ప్రక్రియను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే, కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఎంపీల కోటాను పెంచాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న తరుణంలో కోటా మొత్తం రద్దు చేయడం గమనార్హం.
అయితే, లోక్సభలోనూ కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాపై చర్చ జరిగింది. అయితే, కోటాను ఎత్తి వేయాలని కొందరు.. పెంచాలని మరికొందరు కోరారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి చర్చించనున్నట్లు కేంద్రం ఆ సమయంలో ప్రకటించింది. ఈ విషయమై స్పీకర్ ఓం బిర్లా సైతం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఆదేశించారు. పది సీట్ల కోటా సరిపోదని.. దాన్ని పెంచాలని.. లేదంటే రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి డిమాండ్ చేశారు. అయితే, ఎంపీల కోటాను రద్దు చేసే యోచనలో ఉందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఆ సమయంలో మంత్రి నిర్ణయాన్ని పలువురు ఎంపీలు వ్యతిరేకించారు.
కాగా, కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు ఏటా 10 సీట్లను కేటాయిస్తున్నారు. ఈ సీట్లను ఎంపీలు తమకు అనుకూలంగా ఉన్న వారి పిల్లలకు కేటాయిస్తూ లేఖలు జారీ చేస్తున్నారు. కొందరు ఎంపీలు తమ పరిమితికి మించి కూడా సిఫారసు లేఖలు పంపుతున్నారు. కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాలకు సంబంధించి ఎంపీ కోటా సీట్ల భర్తీ కేంద్రీయ విద్యాలయ సంఘటన్కు పెను సమస్యగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఎంపీ కోటానే ఎత్తివేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/