భారత్ కు కాట్సా నుంచి మినహాయింపులు ఇవ్వలేం: అమెరికా

2019లో రష్యాతో భారత్ ఒప్పందం
ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా తన విధానాలకు వ్యతిరేకంగా ఉండే దేశాలతో మిత్రదేశాలు ఎలాంటి లావాదేవీలు జరుపరాదంటూ ఓ చట్టం కూడా తీసుకువచ్చింది. దాని పేరు ‘కాట్సా’. ‘కాట్సా’ అంటే ‘కౌంటరింగ్ అమెరికాస్ యాడ్వెర్సరీస్ త్రూ శాంక్షన్స్’ అని అర్ధం. తన మాట వినకుండా తన శత్రుదేశాలతో సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా ఈ కాట్సా చట్టం పేరుతో ఆంక్షలు విధిస్తుంది. ఇప్పుడు భారత్ అగ్రరాజ్యం అమెరికాకు మిత్రదేశమే అయినా కాట్సాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రష్యా నుంచి భారత్ 2019లో ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కొనుగోలు చేసింది. దాంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, అమెరికా కొత్త ప్రభుత్వం స్పందిస్తూ, భారత్ కు కాట్సా నుంచి మినహాయింపులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పూర్తిగా, పాక్షికంగా ఎవరికీ మినహాయింపు కల్పించే వెసులుబాటు కాట్సా చట్టంలో లేదని అమెరికా వర్గాలు వెల్లడించాయి. ఇది భారత్ కు కూడా వర్తిస్తుందని వివరించాయి. 2014లో రష్యా బలగాలు క్రిమియాపై దురాక్రమణకు పాల్పడ్డాయంటూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికా… రష్యాకు దూరంగా ఉండాలంటూ తన మిత్రదేశాలకు స్పష్టం చేసింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/