హైదరాబాద్ నుండి ముంబయికి బుల్లెట్ రైలు

మూడు గంటలకు తగ్గిపోనున్న 14 గంటల ప్రయాణం

హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి అతి త్వరలోనే దేశ ఆర్థిక రాజధాని ముంబయి కి బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. అదే సాకారమైతే హైదరాబాద్ నుంచి మూడు గంటల్లోనే ముంబయి చేరుకునే వీలు కలుగుతుంది. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సర్వే కూడా చేపట్టినట్టు తెలుస్తోంది. భూసేకరణపై దృష్టిసారించిన కేంద్రం బుల్లెట్ రైలుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే మహారాష్ట్రలోని థానే జిల్లా అధికారులకు తెలియజేసింది.

హైదరాబాద్- ముంబయి మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు మార్గంలో మొత్తం 11 స్టేషన్లు ఉంటాయి. ఈ రెండు నగరాల మధ్య దూరం 650 కిలోమీటర్లు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 14 గంటలు పడుతోంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే మూడు గంటల్లోనే చేరుకునే వెసులుబాటు లభిస్తుంది. బుల్లెట్ రైలుకు సంబంధించిన సమాచారాన్ని జాతీయ హైస్పీడ్ రైలు కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీ) డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.కె. పాటిల్ థానే జిల్లా డిప్యూటీ కలెక్టర్ ప్రశాంత్ సూర్యవంశీ, ఇతర అధికారులకు వీడియో రూపంలో వివరించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/