అన్ని దారుణాలకు ఆయనే కారణం
వైఎస్ జగనే హిందుత్వంపై ఎక్కుపెట్టిన గన్
అమరావతి: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం అగ్నికి ఆహుతైన ఘటనపై టిడిపి నేత బుద్ధా వెంకన్న స్పందించారు. దేవాలయాల విషయంలో జరుగుతోన్న అన్ని దారుణాలకు సిఎం జగనే కారమణంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
‘ఆ వైఎస్ జగనే హిందుత్వంపై ఎక్కుపెట్టిన గన్. పిఠాపురంలో దేవతా విగ్రహాలు ధ్వంసం చేయించి, సింహాద్రి అప్పన్నకి చెందిన 60 వేల కోట్ల రూపాయల విలువ చేసే మాన్సాస్ భూములు మింగి, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తీసుకువెళ్లే రథాన్ని తగలబెట్టించారు’ అని బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ‘అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 40 అడుగుల పవిత్ర రథాన్ని తగలబెట్టించి, తిరుమల వెంకన్న సన్నిధిలో అన్యమత ప్రచారం చేయించి, శ్రీకాళహస్తి గుడిలో క్షుద్ర పూజలు చేయించి, తాడేపల్లి గోశాలలో గోవులను బలితీసుకున్నాడు. మూర్ఖత్వం, క్రూరత్వం తప్ప దేవుడు అంటే నమ్మకం లేని వాడు’ అని బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/