పంజాబ్‌లో పాక్‌ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌ దళాలు

bsf-shot-down-a-drone-entering-from-pakistan-into-indian-territory

అమృత్‌సర్‌ : అమృత్‌సర్‌ రూరల్‌ జిల్లా చహర్‌పూర్‌ ప్రాంతంలోకి పాక్‌ నుంచి ప్రవేశించిన డ్రోన్‌ను బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ దళాలు కూల్చివేశాయి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టాయి. సరిహద్దు ఫెన్సింగ్‌ వైపున ఉన్న పొలంలో డ్రోన్‌ పడిపోయిందని, అందులో తెలుపు రంగు పాలిథిన్‌ కవర్‌లో అనుమానస్పద వస్తువుతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న ఒక హెక్సాకాప్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్‌ పీఆర్‌వో తెలిపారు.

ఇదిలా ఉండగా.. సోమవారం రాత్రి కశ్మీర్‌లోని సాంబా సరిహద్దు రాజ్‌పురా ప్రాంతంలో గుర్తు తెలియని డ్రోన్‌ సంచరించింది. ఎరుపు – పసుపు లైట్లతో వింత వస్తువు ఎగురుతూ కనిపించగా.. డ్రోన్‌ కదలికగా అంచనా వేస్తున్నారు. ఈ నెల 25న సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్‌లు జారవిడిచిన ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఐఈడీతో పాటు చైనాలో తయారైన రెండు పిస్టల్స్‌తో పాటు భారీ మొత్తంలో బుల్లెట్లు, ఐదు లక్షల భారతీయ కరెన్సీని ఉన్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు సరిహద్దు ఆవల నుంచి ఆయుధాలు, డబ్బును పంపినట్లు అనుమానిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/