సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన : మహిళను వివస్త్రను చేసి.. వీధుల్లో తిప్పారు

సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళ అని చూడకుండా ఆమెను వివస్త్రను చేసి… కళ్లల్లో కారం పోసి…కర్రలతో కొడుతూ వీధుల్లో తిప్పిన ఘటన సూర్యాపేట మండలం రాజునాయక్‌తండా లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రాజునాయక్‌తండా చెందిన శంకర్‌నాయక్‌ జూన్‌ 13న హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన యువతి హత్య కేసులో ఒక నిందితురాలిగా అరెస్ట్ అయ్యింది. ఇటీవల బెయిలుపై విడుదలై సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో ఉంటుంది. అయితే, రాజునాయక్‌ తండాకు చెందిన బంధువు ఒకరు శనివారం మృతిచెందడంతో ఆ మహిళ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చింది. శంకర్‌నాయక్‌ హత్యానంతరం మొదటిసారిగా తండాకు వచ్చిన ఆమెను చూసి.. మృతుని బంధువులు ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే ఆమెపై దాడి చేయడం మొదలుపెట్టారు.

ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేసి కళ్లల్లో కారం పోసి, కర్రలతో కొడుతూ నగ్నంగా వీధుల్లో తిప్పారు. నడిరోడ్డులో దాదాపు గంటసేపు జరిగిన ఈ అమానుషాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ.. ఎంపీటీసీ సభ్యురాలు శాంతాబాయి ఇంటికి పరుగులు తీసింది. శాంతాబాయి ఆమెకు దుస్తులిచ్చి గదిలో రక్షణ కల్పించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు తండాకు వచ్చారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ బాధితురాలిని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.