రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లతో దాడి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ఫై కోడిగుడ్లు , టొమాటోలతో దాడి చేసారు. గత కొద్దీ రోజులుగా హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో రేవంత్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర లో ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ , అధికారపార్టీ నేతల ఫై విరుచుకుపడుతూ వస్తున్నారు. మంగళవారం భూపాలపల్లిలో పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్కు బీఆర్ఎస్ నేతలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా…బీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. ఓ వైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే..మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కండువాలు కప్పుకుని టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. దీంతో సభాస్థలి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

రేవంత్‌రెడ్డి గోబ్యాక్ అంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపైకి కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగి రాళ్లు రువ్వారు. ఉద్రిక్తత మధ్య రేవంత్‌ రెడ్డి కార్నర్ మీటింగ్‌ కొనసాగింది. రేవంత్‌రెడ్డి మీటింగ్‌ జరిగే ప్రాంతానికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. రేవంత్ రెడ్డిపై దాడికి సిద్ధమైన బీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో కార్నర్ మీటింగ్ పక్కనే ఉన్న ఊర్వశి థియేటర్‌లో మోహరించారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను థియేటర్ నుంచి బయటకు రాకుండా గేటుకు తాళం వేశారు.

ఈ దాడి పట్ల రేవంత్ రెడ్డి ఇది స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అనుచరుల పనేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కోడిగుడ్లు వేయించడం కాదని, దమ్ముంటే ఇక్కడికి రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. 100 మంది తాగుబోతులను తనపైకి పంపుతావా అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. తాను తలచుకుంటే నీ ఇల్లు కూడా వుండదని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.