బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి..గుండెపోటు తో బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త మృతి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటన లో అపశృతి చోటుచేసుకుంది. గుండెపోటు తో బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ మృతి చెందారు. బిఆర్ఎస్ పార్టీ గత కొద్దీ రోజులుగా అన్ని నియోజకవర్గాల్లో , డివిజన్ లలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు జరుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ కవిత పాల్గొన్నారు.

కవిత కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు డీజేలతో డ్యాన్స్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే ముందు డ్యాన్స్ చేస్తున్న బండారి నరేందర్ ఒక్క సారిగా కుప్పకూలారు. వెంటనే అక్కడున్న కార్యకర్తలు సీపీఆర్ చేసి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందారు. దీంతో పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. నరేందర్ మృతితో జగిత్యాలలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని రద్దు చేశారు. నరేందర్ మృతిపట్ల సంతాపం తెలిపిన కవిత.. ఆస్పత్రికి వెళ్లి నరేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.