రెండు రోజుల పర్యటనకు భార‌త్ చేరుకున్న బోరిస్‌ జాన్సన్

ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్ కు గుజ‌రాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్వాగ‌తం
భారత్‌లో తొలిసారి ప‌ర్య‌టిస్తోన్న‌ బోరిస్‌ జాన్సన్

అహ్మదాబాద్‌: భార‌త్‌లో రెండు రోజుల పర్యటనకు బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్ లండన్‌ నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌ చేరుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆయనకు ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ తో పాటు ప‌లువురు అధికారులు స్వాగతం పలికారు. భార‌త్‌లో బోరిస్ జాన్స‌న్ రెండు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు.

పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో ఆయ‌న స‌మావేశం అవుతారు. ఇరు దేశాల మ‌ధ్య‌ సంబంధాలపై ఆయ‌న భార‌త ప్ర‌భుత్వంతో చర్చిస్తారు. పెట్టుబడులతో పాటు ఉద్యోగాల కల్పనపై, ప‌లు అంశాల్లో కలిసి పనిచేయడంపై చ‌ర్చ‌లు జ‌రుపుతారు. భారత్‌లో బోరిస్‌ జాన్సన్ తొలిసారి పర్యటిస్తున్నారు. కాగా, బోరిస్ జాన్స‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అహ్మ‌దాబాద్‌లో ఆయ‌న‌కు సంబంధించిన క‌టౌట్లు ఏర్పాటు చేశారు.

కాసేప‌ట్లో ఆయ‌న‌ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో ఆయ‌న స‌మావేశం అవుతారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేప‌థ్యంలో బోరిస్ జాన్సన్‌ భారత్ లో పర్యటిస్తుండ‌డంతో ఆయ‌న ప‌ర్య‌టన‌ మ‌రింత‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/