బ్రెజిల్​ లో కొవాగ్జిన్​ ట్రయల్స్ నిలిపివేత

బ్రసాలియా : కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ను బ్రెజిల్ నిలిపేసింది. ఆ దేశంతో జరిగిన ఒప్పందాన్ని భారత్ బయోటెక్ రద్దు చేయడంతో ట్రయల్స్ ను ఆపేస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న అన్వీసా (బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ)కు భారత్ బయోటెక్ పంపించిన ప్రకటన తర్వాతే ట్రయల్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది.

కాగా.. బ్రెజిల్ కు చెందిన ప్రెసీసా మెడికమెంటోస్ తో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది. ‘‘సంస్థతో మేం ఒప్పందం రద్దు చేసుకున్నాం. అయితే, కొవాగ్జిన్ రెగ్యులేటరీ అనుమతుల కోసం అన్వీసాతో కలిసి పనిచేస్తాం’’ అని నిన్న భారత్ బయోటెక్ వెల్లడించింది. అయితే, సంస్థతో రద్దయిన ఒప్పందంతో పాటే.. క్లినికల్ ట్రయల్స్ నూ నిలిపివేస్తూ బ్రెజిల్ నిర్ణయించడం గమనార్హం.

వాస్తవానికి 2 కోట్ల డోసులను సరఫరా చేసేలా బ్రెజిల్ తో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది. కానీ, ఆ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, ప్రెసీసా అనే సంస్థను ముందుపెట్టి ఆ దేశ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో భారత్ బయోటెక్ .. ప్రెసీసాతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/