జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
రబ్బరు స్టాంపులా రాష్ట్ర ఎన్నికల కమిషన్ : చంద్రబాబు నిశిత విమర్శ
Amaravati: రాష్ట్రంలో మండల పరిషత్ ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. . శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓ రబ్బరు స్టాంపులా మారిందని విమర్శించారు . పరిషత్ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం తమకు లేదన్నారు.రాష్ట్రంలో స్థానిక సంస్థలు అప్రజాస్వామికంగా మారాయని ఆరోపించారు. పరిషత్ ఎన్నికల తేదీల వివరాలను మంత్రులు ముందే ఎలా వెల్లడిస్తారని ప్రశ్నించారు.
రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వచ్చీ రాగానే ఎన్నికలపై నిర్ణయం తీసుకోవటం ఏమిటని నిలదీశారు. గతంలో రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికలు జరిగేవని, ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో 2 శాతం ఎంపీటీసీలే ఏకగీవ్రం అయ్యేవని, ఇప్పుడు 20 శాతానికిపైగా అయ్యాయని, ఎన్నికల్లో పోటీ చేస్తామంటే పోలీసులు వచ్చి బెదిరించారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను అనేక ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. బలవంతంగా ఏకగ్రీవాలు చేస్తున్నారని , ప్రభుత్వ పథకాలు ఉండవని వలంటీర్లు బెదిరించారని అన్నారు.
ఎన్నికల బహిష్కరణ పట్ల తమకు బాధ, ఆవేదన ఉందని చెబుతూ , పరిషత్ ఎన్నికలపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు ఆయన గుర్తుచేశారు. ఎన్నికల అక్రమాలపై టీడీపీ పోరాడుతుందన్నారు. రాష్ట్రం లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాము కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పటం లేదని అన్నారు.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/