రుషికొండపై నిర్మాణాల విషయంలో విపక్షాలకు పనేంటి అంటూ బొత్స ఫైర్

రుషికొండపై నిర్మాణాల విషయంలో విపక్షాలకు పనేంటి అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైస్సార్సీపీ నేతలు అక్రమ తవ్వకాలతో రుషికొండ ను యథేచ్ఛగా తవ్వేస్తున్నారంటూ టీడీపీ సహా వామపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అడ్డగోలు తవ్వకాలతో రుషికొండను మింగేస్తున్నారని ధ్వజమెత్తారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని గత కొద్దీ రోజులుగా వాపోతున్నారు. తాజాగా విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం.. రుషికొండకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలను పవన్ స్వయంగా పరిశీలించారు.

రుషికొండపై నిర్మాణాల విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. రుషికొండలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. రిషికొండపై ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి? అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు. రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను జనసేనాని పవన్ పరిశీలించిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. అసలు కొండపై ప్రభుత్వ నిర్మాణాలతో విపక్షాలకు వచ్చిన నష్టమేమిటని బొత్స ప్రశ్నించారు. గతంలోనూ రిషికొండపై నిర్మాణాలు ఉన్నాయి కదా అన్నారు. రుషికొండపై ఇప్పటికే వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. రుషికొండపై ప్రభుత్వం నిర్మాణాలు చేస్తుంది వాస్తవం. ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి? ఏంటి అని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ రుషికొండ పరిశీలనకు వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి బొత్స. రిషికొండను చూసేందుకు ఓ సెలెబ్రిటీ వచ్చారని ఎద్దేవా చేశారయన. అక్కడ ఏదో జరిగిపోతోందని అనవసర హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గతంలో అక్కడ గెస్ట్ హౌస్ ఉండేదని, ఇప్పుడు దాన్ని తొలగించి మరో భవనం నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. అందులో తప్పేముందని పవన్ ను ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ రాద్ధాంతం చేయడం వల్ల గోరంత కూడా ఉపయోగం ఉండదని బొత్స అన్నారు.