అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌

లండన్ : కొవిడ్‌ ఉద్ధృతంగా ఉన్న సమయంలో తన అధికారిక నివాసంలో విందు ఇచ్చిన వ్యవహారంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. సొంత పార్టీ కన్జర్వేటివ్ సభ్యుల నుంచే విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. 2020 జూన్‌లో జరిగిన ఈ విందును పార్టీగేట్‌ కుంభకోణంగా పేర్కొంటుండగా ఈ వ్యవహారంలో కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యులు బోరిస్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అవిశ్వాస తీర్మానం కోసం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న కన్సర్వేటివ్‌ పార్టీ పార్లమెంటు సభ్యుడు సర్‌ గ్రాహమ్‌ బ్రేడీకి 54 మంది ఎంపీలు ఈ మేరకు లేఖలు అందజేశారు. వీరు వీలైనంత త్వరగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

ప్రతినిధుల సభలో మొత్తం సభ్యుల సంఖ్య 650 కాగా, అధికార కన్సర్వేటివ్‌ పార్టీకి 359 మంది బలం ఉంది. అయితే బోరిస్‌ను పదవి నుంచి తప్పించడానికి సొంత పార్టీలో 180 మంది సభ్యుల బలం అవసరం. ఈ నేపథ్యంలో బోరిస్‌పై అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఉన్నా, తాజా పరిణామాన్ని ఆయనకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అవిశ్వాసంలో జాన్సన్‌ విజయం సాధిస్తే.. కన్జర్వేటివ్‌ పార్టీ నిబంధనల ప్రకారం మరో ఏడాది పాటు ఈ ప్రక్రియ చేపట్టడానికి వీలు లేదు.పార్టీగేట్‌ కుంభకోణంపై కన్జర్వేటివ్‌ పార్టీ ఏర్పాటు చేసిన న్యూ గ్రే కమిషన్‌.. బోరిస్‌పై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పార్టీగేట్‌ వ్యవహారానికి సీనియర్‌ నాయకత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. దీనిపై పార్లమెంటు వేదికగా బోరిస్‌ క్షమాపణలు చెప్పినా ఆయనపై విమర్శలు మాత్రం ఆగలేదు. సొంత పార్టీకి చెందిన 40 మంది సభ్యులు బోరిస్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/