బీహార్‌లో నూడుల్స్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

బీహార్లోని ముజఫర్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నూడిల్స్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ఐదుగురు మృతి చెందగా..పలువురి పరిస్థితి సీరియస్ గా ఉంది. బేలా పారిశ్రామిక ప్రాంతంలోని మోదీ కుర్​కురే, నూడిల్స్​ పరిశ్రమలో బాయిలర్​ పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో పలువురు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎంత మంది పనిచేస్తున్నారో తెలియరాలేదు. పేలుడు చాలా బలంగా ఉందని స్థానికులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రదేశానికి 5-కిమీ దూరం వరకు వినిపించినట్లు వెల్లడించారు. మరోవైపు భారీ ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు కనీసం 5 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. పేలుడు ధాటికి పక్కనే ఉన్న సంస్థలు కూడా దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంతో గాయపడ్డ క్షతగాత్రులను స్థానిక అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను వెలికి పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తున్నామన్నారు.