జవాబు పత్రాల రీ-వాల్యుయేషన్ ను ఉచితంగా చేయించాలలి
రాష్ట్ర ప్రభుత్వ తప్పిదంతోనే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు: బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల వివాదం నేపథ్యంలో ఈ అంశంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ తప్పిదంతోనే ఇంటర్ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలతో గుండె తరుక్కుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నూరేళ్ల బంగారు భవిష్యత్తును ఇంటర్ విద్యార్థులు నాశనం చేసుకోకూడదని ఆయన సూచించారు.
కరోనా వేళ ఆన్ లైన్ తరగతుల నిర్వహణలోనూ రాష్ట్ర సర్కారు అసమర్థంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన వారిలో పేద విద్యార్థులే అధికంగా ఉన్నారని ఆయన అన్నారు. గతంలోనూ మంత్రి కేటీఆర్ బినామీ నిర్వాకంతో 27 మంది విద్యార్థులు బలి అయ్యారని ఆయన తెలిపారు. సర్కారు నిర్వాకం వల్ల ఇంకా ఎంత మంది ఇంటర్ విద్యార్థులు బలికావాలని ఆయన నిలదీశారు. జవాబు పత్రాల రీ-వాల్యుయేషన్ ను ఉచితంగా చేయించాలని ఆయన చెప్పారు. విద్యార్థులకు తాము అండగా ఉంటామని, ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/