సీఎం జగన్ పై సోము వీర్రాజు విమర్శలు

కానుకలు ఇవ్వడం, అప్పులు చేయడమే జగన్ పాలన

అమరావతి: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రాష్ట్రంలో దుమారం రేపిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని, అన్ని చోట్ల నిరసనలు తెలుపుతున్నారని చెప్పారు. కానుకలు ఇవ్వడం… అప్పులు తీసుకురావడమే జగన్ పరిపాలన అని సోము వీర్రాజు దుయ్యబట్టారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని… రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ ఖండిస్తోందని అన్నారు. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రంలో ఉపాధి వస్తుందంటే… దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని విమర్శించారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నారని… సొంత ఆస్తులను జగన్ ఎందుకు తాకట్టు పెట్టడం లేదని ప్రశ్నించారు. దేశంలో ఇలాంటి పాలనను ఎక్కడా చూడటం లేదని అన్నారు.

అశోక్ గజపతిరాజు కుటుంబం ఎన్నో దానధర్మాలు చేసిందని… అలాంటి అశోక్ రాజును విమర్శించే అర్హత వైస్సార్సీపీ నేతలకు లేదని వీర్రాజు మండిపడ్డారు. అలాంటి వ్యక్తులపై విమర్శలు చేసేముందు వైస్సార్సీపీ నేతలు వారి స్థాయిని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పాలన కొనసాగుతోందని విమర్శించారు. విశాఖలో కొనసాగుతున్న భూకబ్జాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/