ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బీజేపీ నిరసనలు

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని ప్రభుత్వ హెచ్చరికలను బీజేపీ పార్టీ తప్పుపడుతుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. జిల్లా కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల వద్ద బీజేపీ నేతలు ధర్నాలకు దిగారు. హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ అందుకునే గణనాధుని ఉత్సవాలకు అడ్డంకులా అంటూ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు.. ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలు, సీఎం సభలు, వైసీపీ మీటింగ్‌లకు లేని కరోనా వైరస్‌ ప్రభావం.. గణనాథుని ఉత్సవాలకే అడ్డొస్తుందా అని ప్రశ్నించారు. కర్నూలు రాజ్‌ విహార్ సెంటర్‌లో భారీ నిరసనలో భాగంగా సోమువీర్రాజు, సత్యకుమార్‌, విష్ణువర్ధన్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వినాయక చవితి సందర్భంగా పందిళ్లు వేసుకుని ఉత్సవాలు జరుపుకోవడానికి అనుమతించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.